ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
మంగళవారం ఉదయం టంగుటూరు మండలం, వల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరై ప్రజలనుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ……….. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజలనుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇది గొప్ప సదవకాశామని, దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగిందని, మీ భూమి మీ దగ్గరే ఉండాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సు లకు శ్రీకారం చుట్టి ప్రభుత్వం యంత్రాంగం మీ దగ్గరకే వచ్చి మీ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ రెవెన్యూ సదస్సులకు రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా వున్నటువంటి దేవాదాయ, ఫారెస్ట్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ తదితర సంబంధిత శాఖల అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుచున్నదన్నారు. ఈ నెల 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 18240 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా, అక్రమాలు జరిగినట్లుగా పిర్యాదులు రావడం జరిగిందన్నారు. భూ యజమానులకు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతీ అర్జీకి రసీదును అందజేస్తామన్నారు. చిన్న సమస్యపైన కూడా అర్జీ అందజేయవచ్చునని చెప్పారు. సదస్సులు ముగిసిన 45 రోజుల్లోగా వచ్చిన వినతులను పరిష్కరిస్తామని తెలిపారు. జనవరి మొదటి వారంలో కొండపి, గిద్దలూరు నియోజక వర్గాల్లో జరిగే రెవెన్యూ సదస్సులకు రెవెన్యూ శాఖ మంత్రి గారు, సీసీఎల్ఏ అధికారులు హాజరుకానున్నట్లు మంత్రి ఈ సంధర్భంగా తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సదస్సులు.. గ్రామీణ ప్రజలకు, రైతులకు గొప్ప సదవకాశామని, ఈ సదస్సులను ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగించుకోవాలని మంత్రి కోరారు.
అనంతరం మంత్రి గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను పరిశీలించారు. సచివాలయం రికార్డ్ లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మి ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి మరియు సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మా నాయక్, తహసిల్ధార్ ఆంజనేయులు, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


