ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లో ఈనెల 26వ తేదీ జరిగే మహాశివరాత్రి వేడుకలకు తనకు వ్యాఖ్యాతగా అవకాశం లభించినట్లు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు తెలిపారు. మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో స్వామి వారికి జరిగే పాగాలంకరణ మహోత్సవానికి తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా శివరాత్రి నాడు జరిగే పాగాలంకరణకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. మూడవసారి కూడా తనకు వ్యాఖ్యాతగా అవకాశం కల్పించిన శ్రీశైల దేవస్థానం వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. శైవ క్షేత్రాలలో ఎక్కడా లేని పాగాలంకరణ మహోత్సవం శ్రీశైల దేవస్థానంలో ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. జన్మలో ఒక్కసారైనా శ్రీశైల దేవస్థానంలో జరిగే పాగాలంకరణ మహోత్సవాన్ని ప్రతి ఒక్క భక్తుడు వీక్షించి తరించాలని కోరారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా అటు సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తూ ఆధ్యాత్మిక రంగంలో ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి ఈ మధ్యకాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగిన రథసప్తమి వేడుకలలో తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవస్థానం ఐదు వాహన సేవలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ప్రస్తుతం శ్రీశైల దేవస్థానం లో జరిగే శివరాత్రి వేడుకలలో మూడవసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుముడింపజేస్తున్న స్వర్ణకంకణ గ్రహీత పొన్నూరు వేంకట శ్రీనివాసులును ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, ప్రముఖ కవులు పాలూరి శివప్రసాద్, కె.ఎస్.వి. ప్రసాద్, షేక్ మహబూబ్ జాన్, గాయకులు ఐ.మురళీకృష్ణ, కల్లగుంట కృష్ణయ్య, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి, చిలకపాటి రంగారావు, తదితరులు అభినందనలు తెలిపారు.
