రైతు వారీ నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు. మంగళవారం కంభం మండలం, కందులాపురం గ్రామ పరిధిలో మరియు కంభం పంచాయతీ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రైతు వారీ నీటి కుంటలను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ కందులాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రైతులు అన్న మురళి, అన్న ప్రసాద్ లకు చెందిన పొలంలో నిర్మించిన రైతు వారీ నీటి కుంటలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మొక్కను నాటారు. పనిచేసిన కాలానికి వారానికి ఎంత నగదు పడుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వివరాలు అడిగితెలుసుకున్నారు. కొంతమంది కూలీలు నగదు పడటం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మండలంలో ఎంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, వారిలో ఎంతమంది ఎంత పనిచేశారు, పనిచేసిన కాలానికి ఎంత వరకు నగదు జమ అయింది అని జిల్లా కలెక్టర్ డ్వామా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంభం పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర రెడ్డి పొలంలో చేపట్టిన రైతు వారీ నీటి కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకించేందుకు నీటి కుంటలు ఉపయోగ పడతాయన్నారు. ప్రధానంగా నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయ వనరులను పెంపొందించు కోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1075 రైతు వారీ నీటి కుంటల నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందని, మరో 800 నీటి కుంటలు పురోగతి లో ఉన్నాయని తెలిపారు. కంభం మండలంలో 140 నీటి కుంటలకు గాను 50 నీటి కుంటలు పూర్తి కాగా మరో 78 నీటి కుంటల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. పశ్చిమ ప్రకాశం లో రైతు వారీ నీటి కుంటల నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, రైతులకు బహుళ ఆదాయాన్ని అందించే నీటి కుంటలను జిల్లాలో ప్రతి రైతు విధిగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తహసీల్దార్ కిరణ్, ఎపిడి భాస్కర్ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



