ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 12న వికసిత భారత్ యూత్ పార్లమెంట్ ను నిర్వహిస్తున్నట్లు క్విస్ విద్యాసంస్థల అధనేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ నిడమానూరి శ్రీ గాయత్రి దేవి తెలియజేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్, క్విస్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలోని రామానుజన్ సెమినార్ హాల్లో జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. “50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి: భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు” అనే అంశంపై యూత్ పార్లమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు దానికి సంబంధించిన పోస్టర్ ను ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతి డి.వి.ఆర్ మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం అని ఆయన అన్నారు. ఇటువంటి ప్రజాస్వామ్య చర్చల్లో యువత భాగస్వామ్యం ఉండాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతలను అర్థం చేసుకునేందుకు పార్లమెంటరీ తరహా వ్యవహారాలు, చర్చల్లో పాల్గొనడం కూడా ఎంతో ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి వేదికలు విద్యార్థులకు పార్లమెంటరీ విధానాలు, పాలన, భారతదేశంలోని ప్రజాస్వామ్య సంస్థల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని అన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లోప్రతిభ కనబరిచే 10 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వ్యవస్థాపక రిజిస్ట్రార్ బి. హరి బాబు, మై భారత్ జిల్లా యువజన అధికారి ఎ. మహేందర్ రెడ్డి, క్విస్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ డీన్ డాక్టర్ నవనీత కృష్ణన్, స్టూడెంట్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.
