బేగంపేట మే 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను ఏ ఒక్క కులానికో, మతానికో ఆపాదించి చూడవద్దని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం బల్కంపేట్ బీకే గూడలోని మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సుజాతతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఓట్ల సవరణ, బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపు అనేది కేవలం ఎన్నికల పారదర్శకత కోసమే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. గతంలో బెంగాల్లో తొలగించిన 90 లక్షల బోగస్ ఓట్లలో ముస్లిం వర్గానికి చెందినవి కేవలం 30 లక్షలు మాత్రమేనని, మిగిలిన 60 లక్షల ఓట్లు ఇతర వర్గాలవేనని ఆయన ఉదహరించారు. దీనిని బట్టి చూస్తే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోందని, అనవసరంగా ఈ ప్రక్రియను భూతద్దంలో చూసి గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు. కేవలం అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురవ రెడ్డితో పాటు పార్టీ నాయకులు ఇ. దయానంద్, ఆకుల మహేష్, క్రాంతి కుమార్, పి. నరేందర్, గుంటి సత్యనారాయణ, కె. నరేష్ తదితరులు పాల్గొన్నారు.
