హైదరాబాద్, జూన్ 7:(జె ఎస్ డి ఎం న్యూస్)
ఎరుకల షెడ్యూల్డ్ తెగల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎకలవ్య ప్రతిభా అవార్డ్స్-2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఎరుకల విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
సికింద్రాబాద్లోని హర్యానా హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థుల విద్యా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ ఎం ఎల్ ఏ శ్రీ గణేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బేతంచర్ల డీఎస్పీ పాలకుర్తి మల్లేశం లు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ సదానందం మాట్లాడుతూ, ఎరుకల సమాజానికి చెందిన విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించడం, ప్రతిభను ప్రోత్సహించడం కోసం ప్రతీ ఏడాది ఎకలవ్య ప్రతిభా అవార్డ్స్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. శంకరయ్య, ఉపాధ్యక్షులు డా. వి. నరసింహ, కె. విజయ్ కుమార్, కె. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీకుత్తాడి శ్యామ్ కుమార్, ఖజాంచి కట్టా మదన్ కుమార్, జాయింట్ సెక్రటరీలు ఎస్. బాలనారాయణ, పి. సుధాకర్ రాజు, ఎస్. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

