జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఈనెల 22వ తేదీన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సదస్సు ( ఎలైట్ బిజినెస్ మీట్ ) నిర్వహించాలని కలెక్టర్ పి.రాజాబాబు నిర్ణయించారు. దీనికి ఒంగోలులోని
ఎస్.జీ.వి.ఎస్. కన్వెన్షన్ హాలును వేదికగా ఎంపిక చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై శనివారం సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సదస్సు విజయవంతం అయ్యేందుకు ఇప్పటినుంచే దృష్టి సారించాలని వారికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సహజ వనరులు, మానవ వనరులను వివరిస్తూ, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను తెలుపుతూ వివిధ రంగాలలోని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పంపాలని చెప్పారు.ఈ సమావేశంలో డీ.ఆర్.వో. మాధురి, ఒంగోలు ఆర్.డీ.వో. చంద్రశేఖర్ నాయుడు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్ పాల్గొన్నారు.

