మామ ఎన్టీఆర్ నే కాదు, రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. వైసిపి ఒంగోలు నియోజక వర్గం ఆధ్వర్యంలో రెండు పోటు పాలనకు రెండేళ్లు అనే కార్యక్రమానికి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడంతోనే ఆరంభమైందన్నారు. చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలను కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ. 2,76,000 కోట్లు నిధులు ప్రజలకు పంపిణీ చేస్తే, చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజాధనాన్ని పంచుకొని దోచుకుంటున్నారన్నారు. ఇచ్చిన హామీని ఒకటి నెరవేర్చలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదన్నారు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు, డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు అన్న తీరుగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాని రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలు సుఖ సంతోషాలతో లేదని, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా పాలన సాగించే హక్కు లేదని విమర్శించారు. వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ మాట్లాడుతూ కేవలం రెండేళ్ల వ్యవధిలోని ప్రజా విశ్వాసం కోల్పోయింది అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
