ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లె శివప్రసాద్ రెడ్డి అన్నారు.
శుక్రవారం దర్శిలో “కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు, సూపర్ సిక్స్ పథకాలని చెప్పి పేద ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు అయింది” అని ఆయన మండిపడ్డారు.
సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మళ్ళీ వెన్నుపోటు పొడిచారు. ఇది వాస్తవం కాదా?” అని ప్రశ్నించారు.
హామీలపై నిలదీత
- 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత ఒక్క మహిళకు అయినా 1500 రూపాయలు ఇచ్చారా?
- డిగ్రీ పట్టా అందుకొని ఉద్యోగం రాని నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్క నిరుద్యోగికి అయినా 3000 రూపాయలు ఇచ్చారా?
- నిరుద్యోగులకు, ఆడపడుచులకు వెన్నుపోటు పొడిచారా లేదా? అని నిలదీశారు.
జగన్ పాలనపై ప్రశంసలు
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మాకే దక్కింది” అని తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటుకు ప్రజలు విసిగిపోయారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ పీడీసీసీ బ్యాంక్ ఛైర్మెన్ మాదాసి వెంకయ్య, దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు, దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకట రెడ్డి, ముత్తినీడి సాంబ, చింతా శ్రీనివాస రెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, కాకర్ల కృష్ణా రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పోసం మధుసూదన్ రెడ్డి, సుంకర బ్రహ్మారెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీ షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.






