బేగంపేట ఆగస్ట్ 20,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దోమల నివారణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మల్కాజిరిగి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సి. ఎన్.రఘు ప్రసాద్ అన్నారు. ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం బేగంపేటలోని సర్ రోనాల్డ్ రోస్ భవనంలో ‘సర్ రోనాల్డ్ రాస్ వారసత్వం-వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల పయనం, వన్ హెల్త్ మిషన్లో సాంకేతిక పురోగతులు’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగాధిపతి, సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, సినియర్ ప్రొఫెసర్ బానోత్ రెడ్యానాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాలకు రఘు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ చిన్న దోమ వల్ల కలిగే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్లే దోమల వృద్ధి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలద్వారా వచ్చే వ్యాధులన్నీ నివారించబడేవేనని అయితే దోమల నిర్మూలన పట్ల సరైన అవగాహన అవసరమన్నారు. ప్రాణాంతకమైన మలేరియా నిర్మూలన దిశగా సర్ రోనాల్ రాస్ చేసిన పరిశోధనలను గుర్తు చేశారు. రెడ్యానాయక్ మాట్లాడుతూ దోమల నివారణపై విస్తృతమైన ప్రచారం అవసరమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విజ్ఞానవంతులైన అధ్యాపకులు, విద్యార్థులు, వైద్యులపై ఉందన్నారు. మస్కిటో డే అంటే దోమల నివారణపై అవగాహన కలిగించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ యేటా నిర్వహిస్తున్న కార్యక్రమమని తెలిపారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ మెడికల్ ఎంటమాలజీ మాజీ డైరెక్టర్, చండీగఢ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ బి.కె.త్యాగి, ప్రొఫెసర్ ఎం. మాధవి, ప్రొఫెసర్ సి. శ్రీనివాసులు, ప్రొఫెసర్ జె.వి.రావు, ప్రొఫెసర్ ఎ.వి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

