బేగంపేట సెప్టెంబర్ 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
జంట నగరాలతో పాటు పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకుపాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠా ను బేగంపేట పోలీసులు చెక్ పెట్టారు.ముఠా లో ఒక నిందితుడి నుంచి ఏకంగా 14 చోరీ బైకులను స్వాధీనం చేసుకున్నారు.
బేగంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పి. గోపాల కృష్ణమూర్తి, ఎస్ హెచ్ ఓ పి. సైదులు, డీఐ తో కలిసి వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన సప్పిడి రాజ్ కుమార్ (50) సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చోరీ చేసిన వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుండేవాడు.
నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన క్రైమ్ బృందం
రాజ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా భారీగా బైకులు రికవరీ అయ్యాయి. స్వాధీనం చేసుకున్న 14 వాహనాల్లో బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5, సైబరాబాద్ కమిషనరేట్ మియాపూర్ పరిధిలోని 3, వరంగల్ కమిషనరేట్ పరిధిలోని 5, రామగుండం కమిషనరేట్ మంచిర్యాల పరిధిలోని ఒకటి, సిద్దిపేట కమిషనరేట్ ములుగు పరిధిలోని ఒక బైక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ముఠాలోని మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని ఏసీపీ తెలిపారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి మరిన్ని వాహనాలను రికవరీ చేస్తామని చెప్పారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన క్రైమ్ టీమ్తో పాటు డీఐ ను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు.

