కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వయోజన విద్య పర్యవేక్షకులు వై చౌడిరెడ్డి సూచించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని శివరాంపురం లో శిక్షణ తరగతులను ప్రారంభించి అభ్యాసకులకు, వాలంటరీ టీచర్లు కు సూచనలు చేశారు. కార్యక్రమానికి ఏపిఎమ్ దేవరాజు అధ్యక్షత వహించారు.
మండల పరిధిలో 6885 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వే ద్వారా గుర్తించారని వయోజన విద్య పర్యవేక్షకులు వై చౌడిరెడ్డి చెప్పారు. వారిలో సగం 3450 మందిని ఈ విడతలో అక్షరాస్యులుగా మార్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
ఎంపిక చేసిన వాలంటరీ టీచర్లతో వచ్చే ఫిబ్రవరి నాటికి శిక్షణ తరగతులు పూర్తి చేయాలని కోరారు. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు అందించడంతో పాటు వీడియో పాఠాల ద్వారా వంద గంటల పాటు శిక్షణ ఇస్తారని కొనసాగించాలని వివరించారు.
వెలుగు ఏపిఎమ్ దేవరాజు సిసి వెంకటేష్ , విఓఏ అనురాధ, పలువురు అభ్యాసకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

