సికింద్రాబాద్, సెప్టెంబర్ 18 (జే ఎస్ డి ఎం న్యూస్) :
గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని జైనగర్ కాలనీలోని గణేష్ మండపం వద్ద చిన్నారులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. LCH బాల భారత్, లయన్స్ క్లబ్ వనితా భారత్, మరియు శ్రీ దీప్తి కౌన్సెలింగ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో కాలనీకి చెందిన పలువురు చిన్నారులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను, సృజనాత్మకతను చాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ వనితా భారత్ అధ్యక్షురాలు డాక్టర్ పి. జ్యోతి రాజా విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బాల్యంలోనే పిల్లలలోని అంతర్గత ప్రతిభను గుర్తించి వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ స్వరూపా రాణి, జి. కృష్ణవేణి, లత, దీప, కవిత తదితరులు చిత్రాలు గీసిన చిన్నారులను అభినందించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి చిన్నారికి నిర్వాహకులు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నిర్వాహక బృందం కృషిని స్థానికులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా కొనియాడారు.
