ప్రతి పాఠశాల నుండి కనీసం ప్రతిభ గల ఇద్దరి విద్యార్థులను గుర్తించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ అన్నారు.
శనివారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో అండర్ 14,17,19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల స్కూల్ గేమ్స్ సెక్రటరీలతో వర్క్ షాపు, కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ…. పాఠశాలలకు క్రీడాసామగ్రి అందిస్తున్నామని, ప్రతి నెలా నిర్వహించే ‘స్కూల్ కాంప్లెక్సు’లో స్కూల్ కాంప్లెక్సులో క్రీడాసామగ్రి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. స్కూల్ కాంప్లెక్సు పరిధిలో పీఈటీలు లేని పాఠశాలల్లో స్థానిక ఉపాధ్యాయున్ని గుర్తించి విద్యార్థుల్లో క్రీడలు ప్రోత్సహించేలా బాధ్యతలు అప్పగించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ‘ఫిట్ ఇండియా’ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి, దానికి సంబంధించి క్విజ్, ఖేలో ఇండియా, క్విట్ ఇండియా ప్రతిజ్ఞ తదితర కార్యక్రమాల్లో పాల్గొని, వాటికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా అప్ లోడ్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ‘స్కూల్ స్పోర్ట్స్ కాంప్లెక్సు’ లు జరుగుతున్నాయి, కాబట్టి ఆ సమావేశాల్లో వ్యాయామోపాధ్యాయులు విధిగా పాల్గొని, తమ పాఠశాల ఔన్నత్యాన్ని, క్రీడాభివృద్ధిని పాలుపంచుకోవాలన్నారు.
పాఠశాలలకు క్రీడాసామగ్రి పంపిణీ
ఇప్పటివరకు 12 జిల్లాల్లో పాఠశాలలకు క్రీడాసామగ్రి అందించామని, మిగిలిన జిల్లాలకు అక్టోబరు 16 లోపు ప్రణాళిక ప్రకారం అందిస్తామని సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి అన్నారు. సీనియర్ సెకండరీ పాఠశాలలకు 17 ఐటమ్స్, ప్రాథమికోన్నత పాఠశాలలకు 14 ఐటమ్స్, ప్రాథమిక పాఠశాలకు 9, ఉన్నత పాఠశాలకు 17 ఐటమ్స్ చొప్పున వాలీబాల్, నెట్, త్రో బాల్, నెట్, హ్యాండ్ బాల్, టెన్నికాయిట్, యోగా మ్యాట్లు, ఫుట్ బాల్, షార్ట్ పుట్ వంటి క్రీడాసామగ్రి వయసుకు తగినట్లు అందిస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పి.పార్వతి , సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి , స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.

