వందే భారత్ రైళ్ల ప్రవేశంతో రైలు ప్రయాణంలో నూతన శకం ఆరంభమైందని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. విజయవాడ నుంచి చెన్నైకి ప్రవేశపెట్టిన నూతన వందే భారత్ రైలు మొదటి ప్రయాణంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్, పలువురు ప్రజలు, బీజేపీ నాయకులు,కార్యకర్తలు వందే భారత్ రైలు కు ఘన స్వాగతం పలికారు. పలువురు ప్రయాణీకులు వందే భారత్ రైలును ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వందే భారత్ రైలులో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ఒంగోలు ప్రాంత వాసులకు చెన్నై, తిరుపతి వెళ్లడానికి ఈ వందే భారత్ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అంతేకాక, ఒంగోలు రైల్వే స్టేషన్ లో 26 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తన కుమారుడు, కుమార్తెతో కలిసి సింగరాయకొండ వరకు ఆయన ఈ రైలులో ప్రయాణించారు. దీనిలోని సౌకర్యాలను అసక్తిగా పరిశీలించి, ప్రయాణికులతో ముచ్చటించారు. ఇంత సౌకర్యవంతమైన రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైలును తయారు చేసిన ఇంజనీర్లకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. వందే భారత్ రైలులో ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు.
వందే భారత్ రైళ్ల ప్రవేశంతో రైలు ప్రయాణంలో నూతన శకం ఆరంభం – జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
24
Sep