హైదరాబాద్ డిసెంబర్ 13
(జే ఎస్ డి ఎం న్యూస్)
మహాత్మా జ్యోతి బా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ ను రాష్ట్ర సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్యలు కల్సి వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశంలో సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై చర్చ
జరిపి తమకు రావాల్సిన బకాయినిధుల్ని వెంటనే మంజూరు చేయాలని, తెలంగాణ రాష్ట్ర సర్పంచులను ఆత్మహత్యల నుండి కాపాడాలని కోరారు. జనవరిలో ఎన్నికలు అంటూ ప్రకటనలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా వున్న సర్పంచులు అయోమయానికి,ఆందోళనకు గురవుతున్నారనీ, ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. ఇప్పటికీ ప్రజావాణిలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ నాలుగు సార్లు వినతిపత్రం ఇచ్చామన్నారు.బిల్లులు చెల్లించాలంటూ సంవత్సర కాలం నుంచి శాంతియుతంగా అనేక ఉద్యమాలు నిర్వహించామన్నారు. ఈ నెల 16 తారీకు ముఖ్యమంత్రి మా బిల్లులు మంజూరు విషయమై మాట్లాడి స్పష్టమైన ప్రకటన చేయకపోతే ,మాకు రావాల్సిన నిధులు మంజూరు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని వారు ప్రభుత్వానికి తెలియజేసినారు.
