రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా మార్కాపురం జి.జి.హెచ్. ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి
చెప్పారు. ఈ ఆసుపత్రిలో అభివృద్ధి చేసిన ఐసీయూ, థైరాయిడ్ పరీక్ష పరికరాన్ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిలతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక సాధించామన్నారు. ఇందులో భాగంగా మూలన పడిన ఐసీయూని పునః ప్రారంభించామని చెప్పారు. వైద్య సేవల అవసరాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా డిప్యూటేషన్ పైన వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలోని రెండో
ఆపరేషన్ థియేటరుకు వారం రోజుల్లోగా ఇన్వర్టర్
ఏర్పాటు చేసేలా, అదేవిధంగా మొదటి థియేటర్ కు బ్యాకప్ సామర్థ్యం పెంచేలా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని మంత్రి చెప్పారు. ఆక్సిజన్ ప్లాంటు,
జనరేటర్లు కూడా మంచిగా పని చేసేలా రిపేర్లు చేయిస్తామన్నారు. విద్యుత్ వైరింగ్ సమస్యల పైనా వైద్యులతో చర్చించామని, దీనిని సరి చేసేందుకు ఇప్పటికే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు వైద్యులు చెప్పారని మంత్రి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తాను పరిశీలిస్తానన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన ఐసీయూ ద్వారా మంచి సేవలు అందించి ఉత్తమ ఐసీయూ విభాగంగా గుర్తింపు పొందేలా పనిచేయాలని వైద్యులకు ఆయన దిశ నిర్దేశం చేశారు. ఒంగోలు వెళ్లే మార్గంలో పట్టణంలోని చెరువు కట్ట రోడ్డును కూడా మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారి వెంట సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ నారాయణ, తహసిల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు ఉన్నారు.



