తాళ్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం జోరుగా వర్షం కురియటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశించిన మేర జూన్, జులై నెలలలో వర్షపాతం లేక పోవటంతో ఖరీఫ్లో పంటల సాగు మందగించినది. దీంతో 18న 59.8 మి.మీల మేర వర్షపాతం నమోదు కావటంతో రైతులు కొంత మేర సాగుకు సిద్దం అయ్యారు. మరలా గత రెండు రోజుల నుండి ఉక్కపోతతో కూడిన ఎండలు వస్తుండటంతో ఆందోళన చెందారు. ఆదివారం సాయంత్రం మరలా మంచి వర్షపాతం నమోదు కావటంతో రైతన్నలలో ఆశలు చిగురించాయి. వరి, కంది, మొక్కజొన్న సాగుకు సిద్ధం అవుతున్నారు.
