ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు అత్యంత శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ప్రజలకు సూచించారు. గణేష్ నిమజ్జన ప్రదేశాల్లో భద్రతా దృష్ట్యా ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాగంణంలో ఏర్పాటు చేసిన పోలీసు గణనాథుడు, 5 రోజులు పూజలందుకున్న అనంతరం ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ స్వయంగా కొబ్బరికాయ కొట్టి నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొని, జై భోలో గణేష్ మహరాజ్ కి జై , గణపతిబప్పా మోరియా ఆదా లడ్డూ కాళియా వంటి నినాదాలతో ఊరేగింపుతో బీచ్ కి వినాయకుడిని తీసుకువెళ్ళారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…గణేష్ విగ్రహాలను తీసుకొని నీటిలో లోతుగా ఎవ్వరూ వెళ్లకూడదని, ముఖ్యంగా ఈతరాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగరాదని సూచించారు. నిమజ్జన సమయంలో మద్యం సేవించి ఎవరు పాల్గొనరాదని, ట్రాఫిక్కు అంతరాయం కల్గించరాదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విగ్రహాల ఊరేగింపులు సజావుగా కొనసాగేందుకు పోలీసు సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారని, ట్రాఫిక్ జామ్ లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు ఊరేగింపులో పోలీసు వారికి సహకారం అందించాలని, ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామరెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, మాల్యాద్రి, తిరుపతి స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.


