రాబోవు ఐదేళ్ళలో ప్రకాశం జిల్లా పారిశ్రామిక హబ్ గా మారనుందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
తెలిపారు.
అమరావతి ఆర్థిక మండలిలో భాగంగా జిల్లాలో అభివృద్ధి చేస్తున్న ప్రాంతాలను సందర్శించేందుకు సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. తొలుత బృందం రామాయపట్నంను సందర్శించిన అనంతరం ఒంగోలు కలెక్టరేట్ కు వచ్చిన సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందానికి జిల్లాలోని అధికారులు పూల మొక్కలతో ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, సింగపూర్ బృందం సభ్యులతో సమావేశమై ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాల భౌగోళిక స్వరూపం, పారిశ్రామిక హబ్ గా మారుటకు గల అవకాశాలు, పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, పారిశ్రామిక అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల తలసరి ఆదాయం రూ.రెండు లక్షల 16 వేల 305 లు ఉందన్నారు. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన లక్ష్యంతో ప్రకాశం జిల్లా ముందుకు వెళ్తున్నామన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా పారిశ్రామిక హబ్ గా మారనున్నదన్నారు. జిడివి 59,289.65 కోట్లు కాగా అందులో వ్యవసాయ దాని అనుబంధ రంగాల సెక్టార్ వాటా 25,437.59 కోట్లు, పరిశ్రమల సెక్టార్ వాటా 10,653.82 కోట్లు, సర్వీస్ సెక్టార్ వాటా 23,198.23 కోట్ల రూపాయలని జిల్లా కలెక్టర్ వివరించారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరంలో పూర్తీ చేసేలా అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తీ అయితే పశ్చిమ ప్రకాశం ప్రాంతం ఎంతో పురో
గతి సాధిస్తుందన్నారు. రైల్వే, రోడ్డు కనెక్టివిటి కలిగి హైదరాబాదు, చెన్నై, బెంగళూర్, నగరాలకు రవాణా పరంగా ఎంతో అనుకూలంగా ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా అని జిల్లా కలెక్టర్ వివరించారు. పరిశ్రమలకు అవసరమైన భూ వనరులు అధికంగా ఉన్న ప్రకాశం జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేలా మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. 65 వేల కోట్ల రూపాయలతో సిబిజడ్ ప్లాంట్, 9,074 కోట్ల రూపాయలతో దొనకొండ హబ్, 60 వేల కోట్ల తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్, 1.03 లక్షల కోట్ల రూపాయలతో బిపిసిఎల్, 4922 కోట్లతో రామాయపట్నం పోర్ట్ ఫేస్ 1, 69 వేల కోట్ల రూపాయలతో ఇండోసోల్ యూనిట్ జిల్లా లో రావడంతో రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రుపొందించుచుకోవడం జరుగుచున్నదని కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో సింగపూర్ ఎకానమిక్ కన్సల్టెంట్ ప్రైస్ సీఈవో చూతోక హిమ్, సింగపూర్ కోపరేషన్ ఎంటర్ ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ త్యాలైన్ చీవో, సింగపూర్ సస్టైనబిలిటీ స్టాటజిక్ ప్రాజెక్ట్ సీనియర్ మేనేజర్ నిషశర్ధ, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ డైరెక్టర్ బి గోపాల్, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రామాయపట్నం పోర్టును సందర్శించిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు…..
రామాయపట్నం పోర్టును సింగపూర్ నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వీరు వచ్చారు. ఇందులో భాగంగా తీర ప్రాంతంలో కీలకమైన ఈ పోర్టు నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్వహణ సామర్థ్యం, లభించే ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, దీని ఆధారంగా చుట్టుపక్కల జరిగే అభివృద్ధి, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులతోనూ, భూ సేకరణ అధికారులతో చర్చించారు. ఆ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
అధికారులు తెలియజేయగా సింగపూర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ బృందంలో సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ తరఫున ఎకనామిక్ కన్సల్టెంట్ చువా ( రిటైర్డ్ ), సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైస్ తరఫున థాయ్, నిషా, వాణిజ్య – పరిశ్రమల శాఖ తరఫున ఫ్రాన్సిస్ ఉన్నారు. కాగా ఈ వివరాలను తెలియజేసిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఏపీ మ్యారీ టైం బోర్డు ఈ.ఈ. శివరాం, పోర్టు టెక్నికల్ డైరెక్టర్ సుధాకర్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.








