హైదరాబాద్ ఏప్రిల్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం సాధారణ అపాయింట్మెంట్ల కోసం సుమారు 8 నుండి 10 పనిదినాల నిరీక్షణ సమయం ఉండటంతో, దీనిని గణనీయంగా తగ్గించేందుకు ప్రత్యేకంగా ‘పాస్పోర్ట్ మేళా’నునిర్వహించనున్నారు. పాస్పోర్ట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, పెరుగుతున్న దరఖాస్తుల రద్దీని
సమర్థవంతంగా నిర్వహించడమే ఈ చొరవ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.
మరోవైపు కరీంనగర్ పాస్పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్కే) సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచుతున్నారు. 2026 మే 4వ తేదీ నుండి కరీంనగర్ పీఎస్కేలో రోజువారీ అపాయింట్మెంట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 220 నుండి 400కు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పెరిగిన కోటా కింద నార్మల్, తత్కాల్ మరియు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) వంటి అన్ని విభాగాల్లో దరఖాస్తులుస్వీకరించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లో నూతన భవనంలోకి మారిన కరీంనగర్ పీఎస్కేను, ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా అన్ని హంగులతో
ఆధునీకరించారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ ఆర్పీఓ పరిధిలో 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఓపీఎస్కే) నిరంతరాయంగా సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ సగటున 4,500 దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోఅపాయింట్మెంట్లను బుక్ చేసుకోవాలని, పాస్పోర్ట్ మేళా ద్వారా అందుబాటులోకి వచ్చే అదనపు స్లాట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆర్పీఓ సూచించింది. మరిన్ని వివరాల కోసం జాతీయ కాల్ సెంటర్ 1800-258-1800 లేదా 040-27715333 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని, పూర్తి సమాచారం కోసం passportindia.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.
హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం (ఆర్పీఓ) కీలక నిర్ణయం. పెరగనున్నఅపాయింట్మెంట్లు తగ్గనున్న నిరీక్షణ.
28
Apr