యోగాసన సాధన నిత్య జీవితంలో భాగమయ్యేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
చెప్పారు. ఈ దిశగా అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ యోగాసన కార్యక్రమాలను నిర్వహించేలా దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 7వ తేదీ నుంచి 15 రోజులపాటు యోగ సాధన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో శనివారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. పర్యాటక, ప్రత్యేక ప్రాధాన్యత గల ప్రాంతాలలో యోగా సాధన కార్యక్రమాలను నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్తపట్నం బీచ్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేస్తూ యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో తన అధ్యక్షతన, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమనాద్ నోడల్ ఆఫీసరుగా, జడ్పీ సీఈఓ, డిపిఓ, డ్వామా పిడి, డి.ఆర్.డి.ఏ. పిడిలతో ప్రత్యేక కోర్ కమిటీ ఉంటుందని కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గాల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్లు తమ పరిధిలోని కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని ఆయన ఆదేశించారు. మండల స్థాయిలో తహసిల్దార్, ఎంపీడీవోలు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఇప్పటి నుంచే ఈ దిశగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కేవలం ఈ 15 రోజులతోనే సరిపెట్టవద్దని, గ్రామాలలో ప్రతిరోజు యోగా సాధన చేసేలా హెల్త్ సెంటర్లు, సచివాలయాల ప్రాంగణాలను వీటికి కేంద్రాలుగా పేర్కొంటూ ఆదేశాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భ్రమరాంబ, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పి.డి. నారాయణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి, పతంజలి యోగా గురువు బాలసుబ్రమణ్యం, మెప్మా, ఒంగోలు మున్సిపాలిటీ, పంచాయతీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

