వచ్చే ఏడాది మార్చి నాటికి రెవెన్యూ సమస్యల రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఒంగోలు డివిజన్ స్థాయి రెవెన్యూ సదస్సు జరిగింది. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి జిల్లాలోని రెవెన్యూ సమస్యల పరిష్కార పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సమస్యలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని రెవిన్యూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న ప్రజల పట్ల వీఆర్వోల ప్రవర్తన దురుసుగా ఉంటే సహించబోనని ఆయన హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలతో వ్యవహరించే విధానం కూడా మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. భూ ఆక్రమణలపై ఉదాసీనంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు. రెవెన్యూకి సంబంధించిన ‘ మీకోసం ‘ అర్జీల పట్ల వీఆర్వోలు వ్యవహరిస్తున్న తీరును తహసిల్దార్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన చెప్పారు. మ్యుటేషన్లు, కుల, మరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జాప్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో వచ్చే నెలకు గణనీయమైన పురోగతి ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీవో స్థాయిలో నెలకు రెండుసార్లు, తహసిల్దార్ స్థాయిలో వారానికి ఒకసారి ఈ విధమైన రెవిన్యూ సదస్సును నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యల పరిష్కార పురోగతిపై సమీక్షించాలని ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా రెవిన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తనతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఆమె చెప్పారు. నిషేధిత 22( ఏ ) భూములు, జీరో ఖాతాలు, ఇతర రెవెన్యూ అంశాలపైనా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్షించి మార్గ నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఇన్చార్జి డీ.ఆర్.వో. మాధురి, ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.


