సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మంది అధికారులకు పోస్టింగ్‌లు -నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి – డీజీపీ సి.వి. ఆనంద్

హైదరాబాద్, జూన్ 29 , (జే ఎస్ డి ఎం న్యూస్) :తెలంగాణ పోలీసు శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పదోన్నతి పొందిన 36 మంది అధికారులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో పోస్టింగ్‌లు కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్, డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నూతనంగా పదోన్నతి పొందిన అధికారులను అభినందించిన డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.

ప్రజల సమస్యలను సత్వరమే గుర్తించి, చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని, ప్రజలకు చేరువయ్యే అధికారులుగా మంచి పేరు తెచ్చుకోవాలని డీజీపీ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాల పెంపు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.

డీఎస్పీ హోదాలో ప్రతి నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని ఆయన తెలిపారు. ప్రజల భద్రత, సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అంకితభావంతో పనిచేస్తేనే వృత్తిపరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కాగా సి ఐ ల నుండి డిస్పీ లుగా పదోన్నతి పొందిన వీరికి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోస్టింగ్స్ కాకుండా ఇతర విభాగాల్లో తమ సేవలను నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *