బేగంపేట జులై 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పిసిసి వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీదేవి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు అనంతరం కోట నీలిమ నూతన సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించారు. నూతన కమిటీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ
ట్రస్ట్ బోర్డు సభ్యులు సేవాభావం తో పనిచేసి దేవాలయ ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనీ ఆకాంక్షించారు.ఉజ్జయిని మహాకాళి అమ్మవారిఆశీస్సులతో నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు త్వరలో జరగబోయే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత వైభవంగా జరిపించడంలో పాలుపంచుకోవాలన్నారు. ఇందుకోసం ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా నిబద్ధతతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
అనంతరం నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించేందుకు కృషి చేసిన డాక్టర్ కోట నీలిమకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ సంప్రదాయాలను పరిరక్షిస్తూ, భక్తుల సేవలో నిరంతరం అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బోనాల జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవంతం చేస్తామని నూతన బోర్డు సభ్యులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు చెక్కల రాజేందర్ ముదిరాజ్, గౌరపల్లి రమేష్, గుండెల్లి దేవి వరప్రసాద్,ఎం కిరణ్, గంట గీత, గుంటి మల్లికార్జున్, డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా, సంజయ్ ప్రకాష్, ఠాగూర్ హేమంత్ సింగ్,రాకేష్ అగర్వాల్ శివకుమార్ తో పాటు దేవాలయఅనువంశిక ధర్మకర్త సురిటి కామేశ్వర్ (చైర్మన్ గా
వ్యవహరిస్తారు) తదితరులు పాల్గొన్నారు.


