హైదరాబాద్, జూలై 29, (జే ఎస్ డి ఎం న్యూస్) :
యువత మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారామ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా కిమ్స్ హాస్పిటల్స్-ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రభావం, చెడు స్నేహాల వల్ల చిన్న వయసులోనే కొందరు దారి తప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది బి. కవిత యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే బాధ్యతాయుతంగా ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. కిమ్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ మణిమాల రావు మాట్లాడుతూ, ఉజ్వల భవిష్యత్తుకు చదువే ఏకైక మార్గమని, జీవితాలను వ్యసనాలకు పణంగా పెట్టవద్దని హితవు పలికారు. అవగాహన, చికిత్స, పునరావాసాల ద్వారా వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడమే నషా ముక్త్ భారత్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెఈఎస్ గ్రూప్ సంస్థల ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఐ. వేంకటేశ్వర్లు, డాక్టర్ ప్రసూన, ప్రొఫెసర్ రెడ్డి రాణి, హెన్నా, సునీతతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
