ఆగస్టు 15న నిర్వహించిన రోడ్డు సేఫ్టీ టీమ్ డెమోలో సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది, 108 సిబ్బంది, ఆర్టీఏ అధికారులు, నేషనల్ హైవే సిబ్బంది & 1033 అంబులెన్సు, అగ్నిమాపక శాఖ అధికారులు మరియు సిబ్బందిని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు వివిధ శాఖలు సమన్వయంతో వేగంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టే లక్ష్యంతో 4E (Emergency, Educated, Engineering, Enforcement) కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు చేపట్టారు.
ఆగస్టు 15న నిర్వహించిన డెమోలో సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, 108, ఆర్టీఏ, నేషనల్ హైవే, ఫైర్ తదితర శాఖలు ఏ విధంగా స్పందించాలి, బాధితులకు ఏ విధంగా సత్వర సహాయం అందించాలి అనే అంశాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద సమయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, అన్ని శాఖలు సమన్వయంతో వేగంగా స్పందించడం ద్వారా ప్రమాద బాధితులకు సకాలంలో మెరుగైన సహాయం అందించవచ్చని తెలిపారు. 4E కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖలు ఇదే సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆగస్టు 15న నిర్వహించిన డెమోను విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరినీ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ జగదీష్, RTA కె.రామచంద్ర రావు, ఎస్సైలు బ్రహ్మనాయుడు, రాజేష్, కోటేశ్వరరావు, అంజి రెడ్డి, మాల్యాద్రి,సిబ్బంది మరియు డెమో లో పాల్గొన్న సిబ్బంది పాల్గొన్నారు.
