ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 31 న చేపట్టనున్న ప్రతిష్టాత్మక పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పర్యటనకు సంబంధించి మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావాని పల్లె వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా బహుళ మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిలు సంయుక్తంగా పర్యటన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్చార్జి ఎరిక్షన్ బాబు, సీఎంఓ ప్రతినిధి రఘు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.: ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాస్త్రోక్తంగా జల హారతి ఇచ్చే వేదికను మంత్రులు, అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. నదీ జలాలకు పూజలు నిర్వహించే సమయంలో భద్రత మరియు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు.సీఎం కాన్వాయ్ మరియు ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా నిర్మిస్తున్న హెలిప్యాడ్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
సాధారణ ప్రజలకు, నాయకులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా (డైవర్షన్) రోడ్ల ఏర్పాట్ల పై జిల్లా ఇంచార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులు సిబ్బందికి కీలక సూచనలు చేశారు.
