భూముల రీసర్వే ప్రక్రియను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. మంగళవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ఒంగోలు డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారుల సదస్సులో ఆమె పాల్గొని పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని వీఆర్వో, ఆర్.ఐ, మండల సర్వేయర్, తహసిల్దార్ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రస్తుతం ఆరో విడత రీసర్వే సాగుతున్నందున మండలాలవారీగా పురోగతిని ఆమె సమీక్షించారు. నిర్దిష్ట గడువులోపు రీసర్వే పూర్తి చేయటంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ దిశగా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడుకు చెప్పారు. పొరపాటున తమ భూములు 22(ఏ) జాబితాలో నమోదయ్యాయని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని, వారి భూములకు క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. మ్యుటేషన్లు కూడా సకాలంలో అయ్యేలా చూడాలన్నారు. వివరాలన్నీ సక్రమంగా ఉన్న భూములకు సంబంధించిన పాస్ పుస్తకాల ప్రింటింగు, పంపిణీ పెంచాలన్నారు. ‘ సర్ ‘ కార్యక్రమంలో పెండింగ్ పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, తహసీల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.


