జిల్లాలోని పరిశ్రమలకు సంబంధించిన 222 క్లెయిములకు రూ.16.60 కోట్ల రాయితీలను జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధ్యక్షతన ప్రకాశం భవనములో ఈ కమిటీ సమావేశం జరిగింది. పరిశ్రమల స్థితిగతులను జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా వివరించారు.
INDOSOL, BPCL, JSW, BDL వంటి మెగా ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. “One Family One Entrepreneur” కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ‘ ఎలైట్ బిజినెస్ మీట్ ‘ లో నమోదైన యూనిట్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటిని సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి చూపుతున్న యూనిట్లకు అవసరమైన భూమిని త్వరితగతిన కేటాయించేలా APIIC అధికారులను ఆదేశించారు. అలాగే, ఎలైట్ బిజినెస్ మీట్లో పాల్గొన్న ఉత్సాహవంతులైన యూనిట్ హోల్డర్లకు బ్యాంకు రుణాలు త్వరితగతిన మంజూరయ్యేలా అవసరమైన సహకారం అందించి, రుణ సౌకర్యాలను సులభతరం చేయాలని ఎల్.డీ.ఎం.కు స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో కూడిన పోస్టరు ను ఈ సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో నాబార్డ్ డీడీఎం రవికుమార్, ఎల్ డి ఎం రమేష్, జిల్లా రిజిస్టార్ బాలాంజనేయులు, ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, ఏపీఐఐసీ, నెడ్ క్యాప్ అధికారులు పాల్గొన్నారు .
