రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాల జీర్ణోదరణకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని గుండాల, ఉడుములపాడు గ్రామాల్లో టిటిడి కల్యాణ మండపాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ఛైర్మన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 800 ఆలయాలు జీర్ణోద్ధరణ పనులకు నిధులు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పులివెందుల, డోన్ నియోజకవర్గం ఎస్ గుండాల ప్రాంతాల్లో టిటిడి కల్యాణ మండపాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసామన్నారు.
కార్యక్రమాల్లో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, టిటిడి అధికారులు పాల్గొన్నారు.





