జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రమైన ప్రకాశం భవనానికి విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోనే ఉత్తమ కలెక్టరేట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐ.ఎస్.ఓ.) సర్టిఫికెట్ దక్కింది. డాక్యుమెంటేషన్, మోనిటరింగ్ సిస్టం, ఫైల్స్ మేనేజ్మెంట్, సమస్యల పరిష్కారం ( గ్రీవెన్స్ రెడ్రస్సల్), మానవ వనరుల నిర్వహణ కేటగిరీలకు సంబంధించి కలెక్టరేట్లో అవలంబిస్తున్న విధానాలకుగాను ఈ అరుదైన గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టరుగా ఏ.ఎస్. దినేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉద్యోగుల పనిలో జవాబుదారీతనం, సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచడంతో పాటు పరిపాలనా వ్యవహారాలలో టెక్నాలజీకి పెద్దపీట వేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఐ.ఎస్.ఓ. ప్రతినిధులు కలెక్టరేటును సందర్శించారు. ఈ ఐదు కేటగిరీలలో అవలంబిస్తున్న విధానాలు ఐ.ఎస్.ఓ. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రతినిధులు గుర్తించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ఆ సంస్థ ప్రతినిధి శివయ్య శనివారం జిల్లా కలెక్టరుకు అందించి అభినందించారు. రాష్ట్రంలో ఈ విధమైన సర్టిఫికెట్ ను తొలిసారిగా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ .కె. శ్రీనివాసులు, ట్రైనీ ఐఏఎస్ అధికారి శౌర్య మస్ పటేల్, డీ.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
