“వై.ఎస్.ఆర్. వాహన మిత్ర” పథకం ద్వారా పొందిన నగదును వాహన అవసరాల కోసం వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. “వై.ఎస్.ఆర్. వాహన మిత్ర”. పథకం క్రింద లబ్ధిదారులకు ఐదవ విడత డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తున్న సందర్భంగా విజయవాడ విద్యాధరపురంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దీనికి అనుబంధంగా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును వారు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ… స్వంత వాహనం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయు ఆపరేటర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్, అవసరమైన మరమ్మతులు చేయించుకునేందుకు వై.ఎస్.ఆర్. వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో 2023-24 సంవత్సరానికి 10,741 మంది లబ్ధిదారుల ఖాతాలలో రూ.10.74 కోట్లను జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నగదును ఇతర అవసరాల కోసం కాకుండా వాహన అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలని వారికి సూచించారు. ఈ నగదును ప్రభుత్వం అందించడం ద్వారా లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. తద్వారా ఈ అవసరాలకు వినియోగించే నగదును కుటుంబ అవసరాల కోసంఉపయోగించుకోవచ్చన్నారు. వాహనాలను మంచి కండీషన్లో ఉంచుకోవాలని ఆయన కోరారు. మీరు క్షేమంగా ఉంటూ, ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఆయన చెప్పారు.
జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక పధకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే వై.ఎస్.ఆర్. వాహనమిత్ర పథకాన్ని ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. గతంలో వాహన యజమానులు వారికున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వాహన బీమా, మరమ్మతులు చేయించుకోలేకపోవడం వలన ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ఈ పథకం వినియోగించుకుని ప్రతి ఒక్కరూ బీమా, మరమ్మతులు చేయించుకోవడం వలన వారికి భరోసా లభించిందన్నారు. ఇంత మంచి పధకాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ… ఈ పధకం ద్వారా ప్రతి ఏడాది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున ఇవ్వడం వలన వారికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ పథకం ద్వారా అందించే నగదును యజమానులు ఉపయోగించుకుని వాహనాలను పూర్తి స్థాయిలో కండీషన్లో ఉంచుకోవడం వలన
ప్రయాణీకులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణీకులు ఆటో, క్యాబ్లపై ఎక్కువగా ఆధారపడటం చూస్తున్నామన్నారు. ఇంత మంచి ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కే దక్కినట్లు ఆయన కొనియాడారు. కార్యక్రమంలో డి.టి.సి. ఆర్.సుశీల, ట్రైనీ కలెక్టర్ శౌర్య మన్ పటేల్ పాల్గొన్నారు.




