వరి పంటలో నారు నుండి కోత దశ వచ్చు వరకు సరియైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్ల బారిన పడకుండా మంచి దిగుబడులు సాధించవచ్చని ఆత్మ పీడి అన్నపూర్ణ తెలిపారు. చీమకుర్తి మండలం పాటి మీద పాలెంలో మంగళవారం పొలం బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా వనరుల కేంద్రం (డిఆర్సీ) ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కోటయ్య పొలంలో వరి నారు మందు ద్రావణంలో ఉంచిన తర్వాత నాటే విధానంను డిఆర్సీ వ్యవసాయాధికారులు రైతులకు చూపించారు. హెక్సాకొనజోల్ శిలీంద్రా మందు 1 మి.లీ లీటరు నీటికి కలిపి నారు కట్టటను మూడు గంటల వరకు మందు ద్రావణంలో ఉంచి పొలంలో నాటినట్లయితే వరి పంటకు ఆశించే అగ్గి తెగులు, పాము పొడ, పొట్ల మళ్లీ వంటి అనేక తెగుళ్ల నివారణకు ఉపయోగపడుతుందని. చెప్పారు. ఒక చదరపు విస్తీర్ణంలో 44 కుదుళ్లు ఉండేలా నాటించారు. రైతు పద్ధతిలో తక్కువ కుదుళ్లు నాటటం జరుగుతుంది. సరైన దూరలో నాటటం వలన మొక్కల సాంద్రత ఉండి దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. కాలిబాటలు తీయించారు. వరి పొలాలు పరిశీలించి పలు తెగుళ్లు ఆశించినట్లు గుర్తించి నివారణ చర్యలు సూచించారు. డిఆర్సీ వ్వవసాయాధికారులు శైలజా రాణి, శేషమ్మలు పాల్గొన్నారు.

