చిన్న పత్రికల సమస్యలపై నిత్యం పోరాటాలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు విజయవాడలోని చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరిగిన సామ్నా విజయవాడ కమిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. అక్రిడిటేషన్ ఉన్న చిన్న పత్రికల జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు వస్తాయన్నారు. చిన్న పత్రికలకు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర యూనియన్ సామ్నాకి అండగా ఉంటుందని తెలిపారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ వివిధ పబ్లికేషన్స్ సెంటర్ నుంచి నడుస్తున్న చిన్న పత్రికలకి అక్రిడేషన్లు, ప్రకటనలు ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. చిన్న పత్రికల సమస్యలపై రాష్ట్ర యూనియన్ సమావేశాల్లో కూడా చర్చిస్తామని తెలిపారు. విజయవాడ ఛాంబర్ పత్రిక ఎడిటర్ ఎంసీదాస్ మాట్లాడుతూ చిన్న పత్రికలను ప్రతి ఒక్కరు ఆదరించాలని, సహాయ సహకారాలు అందించాలని కోరారు. చిన్న పత్రిక లైనా సరే అవి సమాజంలో ప్రజలకు వార్తలను చేరవేసే విషయంలో ప్రముఖ పాత్రను వహిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్న పత్రికల వారికి తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి మాట్లాడుతూ చిన్న పత్రికల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. చిన్న పత్రికలకు నిబంధనలు సడలించి అక్రిడేషన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సామ్నా విజయవాడ అధ్యక్షులు ఎం వి సుబ్బారావు మాట్లాడుతూ సామ్నా ఏర్పాటు చేయడంలో దివంగత అంబటి ఆంజనేయులు పాత్ర గణనీయమని చెప్పారు. సామ్నా అనేది ఏపీయూడబ్ల్యూజే కి తమ్ముడు లాంటి పాత్ర వహిస్తుందని సామ్నా పటిష్టంగా ఉంటే యూనియన్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదించారు. చిన్న పత్రికలు అన్నిటికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, చిన్నపత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సామ్నా విజయవాడ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎంసీదాస్,అధ్యక్షులుగా ఎంవి సుబ్బారావు, కార్య దర్శిగా ఎస్ .గంగరాజు , కోశాధికారిగా ఎం వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా డి భాను ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా అడపా ప్రతాప్ చంద్, జె సుబ్రమణ్యం, శ్రీనివాస్ , గోపాలరావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు ఎస్కే బాబు, విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావ రవి, వసంత్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు.
