పట్టుదలతో శ్రమిస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించడం కష్టమేమీ కాదని అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో నిరుపేద యువకుడు నిరూపించారు. సికింద్రాబాద్ లోని బాలం రాయ్ కు చెందిన మంచోళ్ల సాయి కుమార్ ఈ నెల 10 నుండి 13 వ తేదీ వరకు మలేషియాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని 70 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ ను సాధించాడు. ఈ పోటీలలో 20 దేశాలకు చెందిన సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు.
మాజీమంత్రి తలసాని అభినందనలు
అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన సాయి కుమార్ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సాయి కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి తనకు లభించిన గోల్డ్ మెడల్, మెమెంటో, కప్ లను చూపారు. అంతర్జాతీయ స్థాయిలో లో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంకా మరిన్ని పోటీలలో పాల్గొనాలని, మరిన్ని అవార్డ్ లను గెలవాలని ఆశీర్వదించారు. ఉన్నత స్థాయి లో రాణించే విధంగా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బన్సీలాల్ పేట డివిజన్ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు తదితరులు ఉన్నారు.

