ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులు అందించింది. అకడమిక్స్, రిసర్చ్, క్రీడ విభాగాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన తొమ్మిదిమంది విద్యార్థులు ఈ అవార్డులను అందుకున్నారు. ఆయా విభాగాల్లో మొదటిస్థానంలో నిలిచిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.31,000 నగదు బహుమతిని అందించారు. క్విస్ కాలేజిలోని రామానుజన్ సెమినార్ హాల్ లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి, బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ కిరణ్ రెడ్డి, చీఫ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం విజేతలకు జ్ఞాపిక, సర్టిఫికెట్, మెడల్స్ ను అందజేశారు. బీటెక్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థుల్లో 100 శాతం అటెండెన్స్ సాధించిన వారికి క్విస్ స్టార్టప్ కంపెనీ శ్రీచక్ర గిఫ్ట్స్ అండ్ బియాండ్స్ వారు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా క్విస్ విద్యాసంస్థల అధినేత కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను అందించడం అభినందనీయం అని అన్నారు. కేవలం అకడమిక్స్ కాకుండా విద్యార్థుల్లోని మిగతా స్కల్స్ ని కూడా ప్రోత్సహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సరైన సమయంలో, సరైన టాలెంట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తే విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్యాంక్ ఆఫ్ బరోడా గుంటూరు రీజనల్ మేనేజర్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మన ప్రాంతంలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటి సారని అన్నారు. క్విస్ కాలేజి ప్రీమియం ఇన్ స్టిట్యూషన్ అని, అందుకే ఈ కాలేజిని ఎంచుకున్నట్లు చెప్పారు. విద్యార్థి దశ నుంచే రీసెర్చ్ మీద అవగాహన కల్పించే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారని, అది గొప్ప విజన్ అని ఆయన కొనియాడారు. వివిధ రంగాల్లో రానిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ఇలాంటి అవార్డులు ఇస్తున్నట్లు చీఫ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం చెప్పారు. కార్యక్రమంలో క్విస్ కళాశాల ప్రిన్సిపల్ వైవి హనుమంతరావు, స్టూడెంట్స్ డీన్ జే శ్రీనివాసరావు, క్విస్ కళాశాల ఉపాధ్యాయులు, బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బహుమతులు అందుకున్న విద్యార్థులు..
అకడమిక్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ విభాగానికి చెందిన వైష్ణవి మొదటి బహుమతి అందుకోగా ట్రిపులీకి చెందిన అమృత రెండో బహుమతి, ఈసీఈకి చెందిన శ్రీ పూజిత మూడో బహుమతి సాధించారు. రిసెర్చ్ విభాగంలో ఈసీఈకి చెందిన రమా శైలేంద్ర, సీఎస్ ఈకి చెందిన సంజన, ట్రిపులీ విభాగానికి చెందిన శ్రీ కృష్ణవేణి మూడో బహుమతి అందుకున్నారు. స్పోర్ట్స్ కేటగిరీలో సీఎస్ ఈ నాలుగో ఏడాదికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి మొదటి బహుమతి, ఏడుకొండలు రెండో బహుమతి, ఐటీ విభాగానికి చెందిన అరుణ మూడో బహుమతి అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను కాలేజి యాజమాన్యం, ఆయా విభాగాధిపతులు, ఉపాధ్యాయులు అభినందించారు.


