ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఒంగోలు మేయర్ గంగా డ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, పలు సంఘాల నాయకులతో కలిసి ఆయన పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. పేదరికంలో పుట్టినప్పటికి ఉన్నత చదువులు, ఉన్నత వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వంటి ఎన్నో పదవులను అధిష్టించిన వ్యక్తి సంజీవయ్య అన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఉన్నత విలువలు, అంకితభావానికి నిదర్శనం సంజీవయ్య జీవితం అన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
మేయర్ మాట్లాడుతూ…. కష్ట పడి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్య మంత్రి స్థాయికి చేరుకొన్న సంజీవయ్య జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయమన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన వితంతు, వృద్ధాప్య పెన్షన్లు, లా-కమిషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లు మరియు అనేక భూ సంస్కరణల వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేసారని ఆమె కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, ఎస్సీ కార్పో రేషన్ ఈడి అర్జున్ నాయక్, జిల్లా బిసి సంక్షేమ అధికారి అంజల, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్, మైనార్టి కార్పోరేషన్ ఈడి ధనలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ జయ, దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్ర, బిళ్ళా చెన్నయ్య, దారా అంజయ్య, యదాల బుజ్జి, కాకుమాను రవి, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





