బోలారం రైల్వే స్టేషన్లో జరిగిన అసాధారణ సంఘటన కారణంగా మూసివేసిన రైలు బోగీలలో చిక్కుకున్న సుమారు పదిహేను మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే, ప్రమాద సహాయ రైలు (ఏ.ఆర్.టి.) బృందం స్పందించి వెంటనే ముందుకు సాగింది. అదే సమయంలో, రైల్వే ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ సహాయం కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందానికి సమాచారం అందించారు. ఎన్.డి.ఆర్. ఎఫ్. బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. రైల్వే మరియు ఎన్.డి.ఆర్. ఎఫ్. బృందాలు రెండూ సహాయక చర్యలు చేపట్టి, చిక్కుకున్న ప్రయాణికులను వారి ప్రత్యేక పరికరాలతో సురక్షితంగా రక్షించాయి.
ఈ విపత్తు నిజమైనది కాదు. బొలారం రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే మరియు ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది గురువారం సంయుక్తంగా నిర్వహించిన పూర్తి స్థాయి సాంకేతిక మాక్ డ్రిల్. అత్యవసర పరిస్థితులలో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి సిబ్బంది సామర్థ్యం మరియు అప్రమత్తతను అంచనా వేయడానికి మరియు పెంచడానికి మాక్ డ్రిల్ నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్తోపాటు హైదరాబాద్లోని ప్రాంతీయ ప్రతిస్పందన కేంద్రం (ఆర్.ఆర్.సి)నుండి 22 మంది సిబ్బందితో కూడిన బృందం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్. ) 10 వ బెటాలియన్, ఇన్స్పెక్టర్/ఎన్.డి.ఆర్. ఎఫ్. బి. గౌతమ్ కుమార్ నేతృత్వంలో రైల్వే ఏ.ఆర్.టి. (ప్రమాద సహాయ రైలు) మరియు ఎస్.పి.ఎ.ఆర్.ఏం.వి. (సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్స్) బృందాలు మార్చి 12న ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య బొలారం రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదంపై సంయుక్తంగా మాక్ డ్రిల్ను నిర్వహించాయి .
హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ , హైదరాబాద్ అదనపు డిఆర్ఎం ఎంఏ రెహమాన్ మరియు హైదరాబాద్ డివిజన్ నుండి ఇతర సీనియర్ అధికారులు హాజరై వారి బృందాలతో కలిసి మాక్ డ్రిల్ ను వీక్షించారు.





