హిందూ ధర్మ రక్షణ కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, మతమార్పిడులను అరికట్టడం కోసం, మతం మారి ఇబ్బందులు పడుతున్న హిందువులను స్వధర్మంలోకి తీసుకురావడానికి విశ్వహిందూ పరిషత్ విశేషంగా కృషి చేస్తుందని ప్రాంత విశేష సంపర్క ప్రము. తూముకుంట ప్రతాపరెడ్డి తెలిపారు.
ప్రాంత విశేష ప్రముఖ్ బాధ్యతలు స్వీకరించి దక్షిణాంధ్ర ప్రాంతంలోని ప్రతి విశ్వహిందూ పరిషత్ జిల్లాల్లో పర్యటిస్తూ గురువారం ఒంగోలు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనం విచ్చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతాపరెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ధర్మానికి గ్లాని జరిగినప్పుడు నేను భూమిపై అవతరించి ధర్మరక్షణకు పాల్పడతానని చెప్పినట్లుగా ఆ కృష్ణ పరమాత్మ అంశ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల్లో ఉద్దీపన చెంది హిందూ ధర్మ రక్షణకు, సనాతన సాంప్రదాయాల పరిరక్షణకు, దేవాలయాల అభివృద్ధి, గోమాతల సంరక్షణ, ప్రజల మధ్య సమరసత నిలుపుటకు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులను కలిసి పరిషత్ కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం నుండి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. యువకుల కోసం బజరంగ్దళ్ విభాగం, మహిళల కోసం మాతృ శక్తి, యువతుల కోసం దుర్గా వాహిని, మఠమందిర, అర్చక పురోహిత వంటి తదితర విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
సమావేశము మరియు నగర ప్రముఖుల సంపర్క కార్యక్రమంలో పరిషత్ జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, ప్రాంత సత్సంగ ప్రముఖు సోమ సుబ్బారావు, జిల్లా కోశాధికారి సాధు శ్రీనివాస్ గుప్తా, చక్రధర పెరుమాళ్ళు, సుంకు రఘు, దేశ వెంకయ్య, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, ఇనమనమెళ్లూరి సీతారామయ్య, త్రిపుర భైరవేశ్వరానంద స్వామి, పసుమర్తి వేంకటేశ్వర్లు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

