భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంగా ఉన్న భారత దేశంలో విభిన్న కులాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్లోని పహల్గమ్ లో పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అమానుషమని ఏపి యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపియూడబ్లూజే) జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ అన్నారు.
జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ఏపీడబ్ల్యుయుజే ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో శాంతి ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక శతాబ్దాలుగా భారత్లో కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్నేహపూర్వకమైన వాతావరణంలో జీవిస్తున్నారని అన్నారు. ఇలాంటి దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులు జరిపి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యాటక రంగానికి మారుపేరుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ కు జాతీయంగా, అంతర్జాతీయంగా టూరిస్టులు లక్షల సంఖ్యలో వస్తుంటారని, దీనివలన ఆ రాష్ట్రానికి మంచి ఆదాయం రానుండడంతో అక్కడి ప్రజలు పర్యాటక రంగంపైనే ఆధారపడి అధిక సంఖ్యలో జీవనం కొనసాగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక గైడులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో బాధితులకు అండగా ఉండి వైద్య సహాయం అందించడమే కాకుండా, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేశారని, ఈ సందర్భంగా పహల్గమ్ ముస్లిం ప్రజలను అభినందిస్తున్నామని ఆయన అన్నారు.
కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను తీయడం ద్వారా ఉగ్రవాదులు సంబరపడుతున్నారని, ఇది వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు.
గతంలో కూడా ఉగ్రవాదులు అనేక సందర్భాల్లో అమాయక ప్రజలను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగిందని గుర్తు చేశారు. మతసామరస్యానికి ప్రతీక అయిన భారత్ ను విడదీయడం ఎవరి తరం కాదని, కావున ఈ విషయాన్ని ఉగ్రవాదులు గుర్తుంచుకోవాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ హెచ్చరించారు.
పహల్గమ్ సంఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఎపియుడబ్లూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూల అల్లూరి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పహల్గమ్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ సభ్యులు జిఎల్ నరసింహారావు, కెవి సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె బాజీవలి, యూనియన్ జిల్లా కోశాధికారి డి బాబి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కె అన్ను, సుబ్రమణ్యం, యూనియన్ నాయకులు ఎస్ కె మహబూబ్ భాష,ఆదినారాయణ, సయ్యద్ షాకీర్ హుస్సేన్,మల్లికార్జున, నరేంద్ర, వి.రాజు, ఎస్ కె మస్తాన్ బాబు, ఎస్ కె కరీం,ఎస్ కె బషీర్, ఎస్ కె రఫీ, అర్ చెన్నయ్య, అన్వర్ భాష, వై సుబ్బారావు, శేఖర్, మల్లికార్జున రెడ్డి,యోగి, తదితరులు పాల్గొన్నారు.
