పొగాకు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలనేది ప్రభుత్వం లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులోని త్రోవగుంటలో గల పొగాకు వేలంకేంద్రంను సందర్శించి జరుగుతున్న వేలం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రైతుల వద్ద నుండి పొగాకు కొనుగోలు విధానాన్ని పరిశీలించి పొగాకు బోర్డు ఆర్ఎం, వేలం నిర్వహణ అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రైతులతో మాట్లాడుతూ … ఎన్ని ఎకరాల్లో పొగాకు పంట వేసారు, ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కౌలు, కూలీ రేట్లు పెరగడం జరిగిందని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం వుందని, పొగాకు మంచి డిమాండ్ ఉన్నప్పటి కీ రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని, రైతులు తెచ్చిన బేళ్లను నోబిడ్ చేయకుండా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని పొగాకు రైతులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలనేది ప్రభుత్వం లక్ష్యమని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు, వేలం నిర్వహణ అధికారి తులసి, ఒంగోలు రూరల్ తహసిల్దార్ ప్రసాద్, తదితరులు ఉన్నారు .


