ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వైశాఖ శుద్ధ దశమి, బుధవారం మే7వ తేదీన ఒంగోలు కన్యకాపరమేశ్వరి అమ్మవారి వీధిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఆలయ ప్రాంగణమును పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు, తదుపరి 108 మంది కన్నెపిల్లలచే ఆలయ అర్చకులు శర్మ, ఫణి శర్మలు శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహింప చేశారు. సాయంత్రం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి సింహ వాహనంపై స్థిరపరచి ఒంగోలు పురవీధుల్లో నగరోత్సవం జరిపారు. వాసవి కోలాట భజన మండలి సభ్యులు అద్భుతమైన వాసవి మాత పాటలకు కోలాట మాడారు. పెద్ద సంఖ్యలో భక్తులు నగర ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ వాసవి సేవాదళ్ సభ్యులు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శాకాహార కేకును కట్ చేశారు. అనంతరం అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యలు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మ వాసవి మాత దర్శనం చేసుకుని సమాజంలో శాంతి సౌబ్రాతృత్వాలు ద్విగుణీకృతం అవ్వాలని, దేశ రక్షణలో యువత పాల్గొనాలని, ఈ తమ కోర్కెలు నెరవేరాలని ప్రార్ధించారు. ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగినది.




