పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనాన్ని పెంచడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ వన మహోత్సవం ‘ కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగోలు మినీ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాతలతో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కాలుష్య కారక ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే ఒక కోటి మొక్కలు నాటేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో నాలుగు లక్షల పదివేల మొక్కలు ఒక్కరోజే నాటేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ ఏడాదిలో జిల్లాలో 35 లక్షలకుపైగా మొక్కలు నాటేలా దృష్టి పెట్టామన్నారు. తద్వారా జిల్లాలో ప్రస్తుతం 36% గా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని ఏడాది 50 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నూకసాని బాలాజీ మాట్లాడుతూ ….పర్యావరణాన్ని కాపాడుకోవటంపైనే మానవజాతి మనుగడ ఆధారపడి ఉందన్నారు. ఈ విషయాన్ని ఆనాడే అశోక చక్రవర్తి గుర్తించి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నటించినట్లు చెప్పారు.
మేయర్ మాట్లాడుతూ… ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత ఈ సందర్భంగా కలెక్టర్ , ఇతర అతిధులు
ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారికి మొక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ ( సోషల్ ఫారెస్ట్ )
రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయంలోనూ….
స్థానిక కేంద్రీయ విద్యాలయంలోనూ జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ' ఏక్ పేడ్ మా కే నామ్ ( తల్లి పేరుతో ఒక మొక్క ) ' అనే నినాదంతో కలెక్టర్ తో కలిసి విద్యార్థులు కూడా మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఒక అలవాటుగా, బాధ్యతగా చిన్ననాటి నుంచే చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని చెప్పారు. కాగా ప్రకాశం భవనం ప్రాంగణంలో డిఆర్ఓ పి.చిన ఓబులేసు, డిఎస్ఓ పద్మశ్రీ, పరిపాలన అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు, తన కార్యాలయ ప్రాంగణంలో ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర ఉద్యోగులు ;మొక్కలు నాటారు.



