ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి శాగం కొండా రెడ్డిలు కోరారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం 50శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇంకా కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలలో నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఐదు రోజులకు అందించబడునని చెప్పారు. జనుములు పది కేజీలు రూ.545, జీలుగలు పది కేజీలు రూ. 615 లకు అందిస్తున్నట్లు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలను విత్తుకొని 40 రోజుల తర్వాత నేలలో కలియ దున్నినట్లయితే నేల మంచి కండ కలిగి ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అందిస్తున్న రాయితీలను వినియోగించుకోవాలని వక్తలు కోరారు. ఎంపీడీఓ దార హనుమంతరావు, సర్పంచి లు మందా శ్యామ్సన్, వలి, చందన, కైపు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

