బేగంపేట జూన్ 27(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో తమ నివాసాలను కోల్పోతామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల సమీపంలోని నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘ఎయిర్క్రాఫ్ట్ డిమోలిషన్ ఆఫ్ ఆబ్స్ట్రక్షన్ రూల్స్ 2025’ పేరుతో ఒక ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.ఈ నిబంధనల ప్రకారం, ఏరోడ్రోమ్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల ఎత్తును తగ్గించడం లేదా అవసరమైతే పూర్తిగా కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే అధికారులు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న బహుళ అంతస్తుల భవనాలపై దృష్టి పెట్టారు. భద్రత దృష్ట్యా కేంద్ర పౌర విమాన యాన శాఖ విమానాశ్రయాల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
