గిరిజన సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు డిఆర్ఓ బి.చిన ఓబులేసు చెప్పారు. శనివారం ఒంగోలులోని గిరిజన భవనంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డిఆర్ఓ తో పాటు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.శ్రీనివాస ప్రసాద్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలుత
అంబేద్కర్, గిరిజన వీరుల చిత్రపటాలకు వీరు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ… గిరిజన హక్కులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇటీవల పుల్లలచెరువు మండలం నరజాముల తండాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల విషయంలో అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆయా భూములపై హక్కులను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రత్యేకంగా సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. గిరిజన ఆవాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలను జిల్లా యంత్రాంగం తీసుకుంటున్నట్లు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్వశక్తితో నిలబడేలా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని, అవకాశాలను అందిపచ్చుకొని అన్ని రంగాలలోనూ గిరిజనులు ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో మెరుగైన మార్కులు సాధించిన ఇద్దరు గిరిజన విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల చొప్పున గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాలాజీ నాయక్ , డాక్టర్ లక్ష్మా నాయక్ లు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించారు. ప్రతి ఏడాది ఇలాగే ఆర్థిక సహాయం చేసి ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన హక్కులు, సంక్షేమ సంఘాల నాయకులు పేరం సత్యం, యాకసిరి నాగరాజు, ఆర్. సైదా నాయక్ , కత్తి బుజ్జమ్మ, ఇండ్ల సుజాత, కే.సేవ్యా నాయక్ , చెవుల అంజయ్య, నిమ్మల ఈదన్న, బానావత్ వెంకటేష్ నాయక్, యాకసిరి జాలయ్య, ఎం.బాలు నాయక్, బి.మంతన్న,
గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.



