కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున సిబ్బంది ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, పరిశ్రమలకు విద్యుత్ డిమాండు – సరఫరా, పీఎం సూర్యఘర్, ఆర్.డి.ఎస్.ఎస్ పనులు, స్మార్ట్ మీటర్లు, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల్లో పురోగతి, సిబ్బంది – ఖాళీలు, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారం, ఐ. వి. ఆర్. ఎస్. సర్వేలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ఆయా అంశాలపై ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. కట్టా వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. ఖాళీగా ఉన్న ఏ.ఈ.ఈ. పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్వహణ విధులు చేస్తున్నామన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పనిచేసే ప్రాంతంలోనే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీని ద్వారా సేవలలో నాణ్యత పెరుగుతుందని, ప్రజలలోనూ సానుకూల దృక్పథం ఏర్పడుతుందని చెప్పారు. ప్రధానంగా ఐ.వి.ఆర్.ఎస్ సర్వేలో విద్యుత్తుశాఖ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలన్నారు. దోర్నాల, మార్కాపురం, ముండ్లమూరు, చీమకుర్తి, పెద్దారవీడు, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, పామూరు, మద్దిపాడు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్.డి.ఎస్.ఎస్. కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు కొత్తగా వేస్తున్న
3-ఫేస్ విద్యుత్ లైన్ల పనులు కూడా వేగవంతం చేయాలని కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఈ.ఈ.లు, డి. ఈ.ఈ.లు, నెడ్ క్యాప్ అధికారులు పాల్గొన్నారు.

