అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై మున్సిపాలిటీలు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యము, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఒంగోలుతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మున్సిపాలిటీల వారీగా కార్యాలయంలో ఉన్న పారిశుధ్య కార్మికుల వివరాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, డ్రైనేజీలను శుభ్రం చేయటం, తాగునీటి సరఫరా పై ప్రధానంగా ఆమె సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణపై ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తున్నందున పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదు అని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆయా విషయాలలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనరు కె. వెంకటేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీలను శుభ్రం చేయటానికి నగరంలో 15 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. పారిశుధ్యం ప్రస్ఫుటంగా కనిపించేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అన్న క్యాంటీన్లలోనూ పారిశుద్ధ్యము, మౌలిక సదుపాయాలు కీలకమని కమిషనర్లకు చెప్పారు. వీధి కుక్కలను కట్టడి చేయటం, వాటికి వ్యాక్సిన్ వేయించడం పైనా దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు చెప్పారు. జంతు ప్రేమికుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్లతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా పాల్గొన్నారు.

