ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రకాశం జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తిగా నిండిపోయాయని,నీటి మట్టం పెరగడం వల్ల అనేక చోట్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్లు గమనించబడిందని,దసరా సెలవుల నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల శివార్లలో ఉన్న చెరువులు, బావులు, కాలువల్లో పిల్లలు, యువకులు ఈతకు వెళ్లడం వల్ల ప్రమాదకరమైన ఘటనలు జరగొచ్చని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.చిన్నారులు, విద్యార్థులు, యువకులు తమ విలువైన ప్రాణాలను సరదా కోసం ప్రమాదంలోకి నెట్టుకోకూడదని ఆయన అన్నారు. జిల్లాలోని అన్ని చెరువులు, జలాశయాలు, నీటి ప్రవాహ ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించి, ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత రాకున్నా ఇతరుల ఒత్తిడికి లోనై నీటిలోకి దిగకుండా అడ్డుకోవాలని సూచించారు.ఈతకు వెళ్లే ముందునీటిలోతు ఎంత ఉందో సురక్షితమైన విధానాలతో అంచనా వేయాలని(కర్ర, పరికరం, పొడవైన వస్తువు),నీటి ప్రవాహం తక్కువగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఈతకు ప్రయత్నించాలని,మద్యం సేవించి నీటిలోకి దిగడం అత్యంత ప్రమాదకరమని,విహార యాత్రల సమయంలో లోతు తక్కువ ప్రాంతాల్లో మాత్రమే స్నానం చేయాలని,చెరువులు, బావులు, కాలువల్లో ప్రమాదాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,ఈత రాకున్నా, స్నేహితుల బలవంతం చెయ్యరాదని సూచించారు.ఇటీవల వర్షాల దృష్ట్యా జిల్లాలో అనేక ప్రాంతాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరిందని, అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణాల పరిరక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ స్పష్టంగా సూచించారు.
